సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు, ఎలక్ట్రిక్ వాహనాలను సూర్యరశ్మి ద్వారా రీచార్జ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఇదే ఆలోచన హైదరాబాద్లోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్) శాస్త్రవేత్తలకు కూడా వచ్చింది. ఇంకేముంది.. ఆచరణలో పెట్టేశారు. ఫొటో రీచార్జిబుల్ లిథియం-అయాన్ బ్యాటరీలను తయారు చేసేశారు. సంస్థ శాస్త్రవేత్త టీఎన్ నారాయణన్ నేతృత్వంలోని బృందం.. పలు అధ్యయనాల అనంతరం సోలార్ చార్జింగ్ బ్యాటరీని ఆవిష్కరించారు. ఈ ప్రకియలో భాగంగా వీరు లిథియం అయాన్ బ్యాటరీల్లో మాలిబ్డినం సల్ఫేడ్, మాలిబ్డినం ఆక్సైడ్ల కలయిక అయిన హెటిరోస్ట్రక్చర్ను ఉపయోగించారు. ఆ తర్వాత పూర్తిగా లిథియం స్థానంలో సగం గ్రాఫైట్ను వినియోగించి సూర్యకాంతి ద్వారా చార్జింగ్ చేసేందుకు ప్రయత్నించి విజయం సాధించారు. సగం లిథియాన్ని కాథోడ్గా, మరో సగం గ్రాఫైట్ను ఆనోడ్గా వినియోగించి, విజయవంతంగా సౌరశక్తితో చార్జింగ్ కావటాన్ని గమనించారు. ఈ బ్యాటరీని విద్యుత్తు ద్వారా, సోలార్తోనూ రీచార్జ్ చేసుకోవచ్చని టీఎన్ నారాయణ్ తెలిపారు. సెల్ఫోన్లల్లో వినియోగించే బ్యాటరీ సామర్థ్యం తరహాలోనే ఈ బ్యాటరీలు పనిచేస్తాయని వివరించారు. బ్యాటరీల పనితీరు మరింత సమర్థంగా ఉండేందుకు కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన మైకేల్ డీ వోల్డర్స్ గ్రూప్తో సంప్రదింపులు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. https://t.me/offerbazaramzon
0 Comments