Ad Code

ఇన్ స్టా గ్రామ్ లో యాడ్‌ క్లిక్ చేసి పది లక్షలు పోగొట్టుకున్న మహిళ !


ర్నాటకలోని మంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఇన్ స్టా గ్రామ్ లో ఓ యాడ్ చూసింది. పార్ట్ టైమ్ జాబ్ తో మరింత ఆదాయం పొందవచ్చు అనే యాడ్ ఆమెను బాగా ఆకట్టుకుంది. ఈ యాడ్ మీద క్లిక్ చేసి తాను ఆ ఉద్యోగం చేయడానికి సిద్ధమేనంటూ ఆ నెంబర్ కు మెసేజ్ పంపించింది. టెలిగ్రామ్ లో కనెక్ట్ కావాలని అవతలి నుంచి సమాధానం వచ్చింది. సదరు ఉద్యోగి, మెసేజ్ లో చెప్పినట్లుగా ఓ యాప్ డౌన్ లోడ్ చేసి కనెక్ట్ అయ్యింది. అవతలి వ్యక్తితో మాట్లాడింది. మీరు పెట్టే పెట్టుబడి మీద 30 శాతం రాబడి ఇస్తామని చెప్పారు. బాధితురాలు తన గూగుల్ పే ద్వారా వాళ్లు చెప్పిన UPI IDకి రూ.7,000 పంపింది. ఇచ్చిన మాట ప్రకారం ఆమె ఖాతాలోకి రూ.9,100 వచ్చింది. నెమ్మదిగా ఆమె స్కామర్ ను నమ్మడం మొదలు పెట్టింది. రూ.10,50,525 బదిలీ చేసింది. ఆ తర్వాత సదరు స్కామర్ ఆమెను బ్లాక్ చేశాడు. తాను మోసపోయానని గ్రహించిన మహిళ పోలీసులను ఆశ్రయించింది. పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. లింక్డ్ ఇన్, నౌకరీ.కామ్ లాంటి జెన్యూన్ పోర్టల్స్ ద్వారా పార్ట్ టైమ్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. ఒకవేళ ఇతర మార్గాల ద్వారా ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు తెలిస్తే, జాబ్ ఆఫర్ చేసే వ్యక్తులు, సంస్థల గురించి క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. వారి పేరు, వారి కంపెనీ పేరుతో పాటు పూర్తి వివరాలను తెలుసుకోవాలి. ఉద్యోగం ఆఫర్ చేస్తున్న కంపెనీ గురించి గూగుల్ లో వెతికి చూడాలి. ఉద్యోగం కోసం పేరు, ఫోన్ నంబర్ మొదలైన వ్యక్తిగత సమాచారాన్ని పూరించే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. అపరిచితుల బ్యాంక్ ఖాతాలోకి ఎట్టిపరిస్థితుల్లో డబ్బును బదిలీ చేయవద్దు. మీ బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు. ప్రముఖ కంపెనీలు మీకు ఉద్యోగం ఇవ్వడానికి ఎలాంటి డబ్బు అడగవని గుర్తుంచుకోవాలి. 

Post a Comment

0 Comments

Close Menu