Ad Code

జూన్ త్రైమాసికంలో ఆపిల్ అమ్మకాల రికార్డు


దేశంలో ఆపిల్ సంస్థ రికార్డు నమోదు చేసింది. జూన్ త్రైమాసికంలో ఐఫోన్ అమ్మకాల్లో ఏకంగా రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా ఉన్న భారత్ లో పాగా వేయడానికి ఆపిల్ వేసిన అడుగులు అదిరిపోయే ఫలితాన్ని ఇచ్చాయి. ఆపిల్ సంస్థ ఇటీవల ఢిల్లీ, ముంబైలలో రెండు ఔట్ లెట్లు ప్రారంభించిన విషయం తెలిసిందే. భారత్ లో అమ్మకాల వృద్ధి పట్ల కంపెనీ సంతోషంగా ఉందని యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. 'మేము భారత్ లో జూన్ త్రైమాసిక రికార్డును నెలకొల్పాం. ఐఫోన్ బలమైన అమ్మకాల ద్వారా ఈ రికార్డు సాధించాం. ఈ స్ప్రింగ్ సీజన్ లో భారత్ లో మా కొత్త స్టోర్ ల పనితీరు మా అంచనాలకు మించి నమోదు అయింది' అని ఆదాయ వివరాల ప్రకటన సందర్భంగా ఆపిల్ సంస్థ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. ఆపిల్ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ లూకా మేస్త్రీ ప్రకారం.. భారత్ లో ఐఫోన్ ఆదాయ వృద్ధి రెండంకెలలో ఉంది. ఇటీవలె ఢిల్లీ, ముంబయి నగరాల్లో ఏర్పాటు చేసిన స్టోర్లతో అమ్మకాలు మరింతగా పెరిగినట్లు ఆపిల్ సంస్థ పేర్కొంది. ఆపిల్ బలమైన ఐఫోన్ అమ్మకాలు నమోదు చేసిన మార్కెట్లలో ఇండోనేషియా, పోలాండ్, ఫిలిప్పీన్స్, టర్కీ, యూఏఈ, మెక్సికో, సౌదీ అరేబియా ఉన్నట్లు ఆదాయ వివరాల ప్రకటన సందర్భంగా టిమ్ కుక్ పేర్కొన్నారు. ఢిల్లీ, ముంబయి రిటైల్ స్టోర్లు అంచనాలకు మించిన పనితీరు కనబరుస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ అయిన భారత్ లో బాగా పని చేయాల్సి ఉంటుందని, ప్రస్తుతం కనబరిచిన వృద్ధి పట్ల చాలా సంతోషంగా ఉందని టిమ్ కుక్ అన్నారు. అయితే భారత్ లో ఆపిల్ వాటా ఇప్పటికీ తక్కువగానే ఉందని, ఈ రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఎదగడానికి గొప్ప అవకాశాలు ఉన్నాయన్నారు. అది సాధించడానికి శాయశక్తులా కృషి చేస్తామని టిమ్ కుక్ పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu