చంద్రయాన్-3 ల్యాండర్ నుంచి కిందికి దిగిన రోవర్ చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ పరిశోధనలు కొనసాగిస్తోంది. శివ శక్తి పాయింట్ వద్దనున్న ల్యాండర్ నుంచి జాబిల్లి నేలపైకి జారుకున్న రోవర్ మరుక్షణం నుంచే కర్తవ్య నిర్వహణలో నిమగ్నమైంది. చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లు పుష్కలంగా ఉన్నట్లు గుర్తించింది. అలాగే చంద్రుడిపై పలు ఖనిజాలు జాడను గుర్తించింది ప్రజ్ఞాన్ రోవర్. వారం రోజుల నుంచి తనపని తాను చేసుకుంటూ పోతున్న రోవర్.. మాంగనీస్, క్రోమియం, టైటానియం, కాల్షియం, అల్యూమినియం, సల్ఫర్, సిలికాన్, ఇనుము ఖనిజాల ఆనవాళ్లు గుర్తించింది. దీనికి సంబంధించిన ఫొటోలను అధికారికంగా విడుదల చేసింది ఇస్రో. హైడ్రోజన్ కోసం ఇంకా రోవర్ పరిశోధిస్తోందని ఇస్రో తెలిపింది. ఇక మిగిలిన ఏడు రోజుల్లో చందమామపై ల్యాండర్, రోవర్ శాస్త్రీయ పరిశోధనలు చేస్తాయి. రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడి ఉపరితలంపై మట్టి స్వభావాన్ని విశ్లేషిస్తుంది. అలాగే చంద్రుడిపై ఉన్న దుమ్ము ధూళీ, రాళ్లలోని రసాయనిక సమ్మేళనాలను రోవర్ గుర్తిస్తుంది చంద్రునిపై తన పనిని నిరంతరం కొనసాగిస్తున్న చంద్రయాన్ 3.. ఇస్రో ప్రతిరోజూ ఈ మిషన్కు సంబంధించిన తాజా అప్డేట్లను అందిస్తోంది. మంగళవారం నాడు ప్రజ్ఞాన్ రోవర్ క్లిక్ చేసిన విక్రమ్ ల్యాండర్ చిత్రాలను ఇస్రో షేర్ చేసింది. దీనితో పాటు స్మైల్ ప్లీజ్ అని ఇస్రో క్యాప్షన్ ఇచ్చింది. నిన్ననే చంద్రుని దక్షిణ భాగంలో ఆక్సిజన్, ఇతర మూలకాల ఉనికిని ఇస్రో ధృవీకరించింది. రోవర్ ఇలా అంశాలను గుర్తించడం పెద్ద విజయమేనని ఇస్రో చెబుతోంది.
0 Comments