మెటా యాజమాన్యంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు పేయిడ్ సర్వీసులను తీసుకు రాబోతున్నదని ఓ నివేదిక తెలిపింది. తొలుత యూరప్లో మాత్రమే పేయిడ్ సర్వీసులను తీసుకురాబోతుందని పేర్కొంది. ప్రకటనలు, గోప్యతకు సంబంధించి యూరోపియన్ యూనియన్ నుంచి ఎదురవుతున్న నిరంతర ఒత్తిడి నేపథ్యంలో మెటా యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ పేయిడ్ సర్వీసులపై పక్కా సమాచారం అందుబాటులో లేనప్పటికీ భారత్లోనూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేయిడ్ సర్వీసెస్ ప్రారంభించే అవకాశాలున్నాయి. యూరోపియన్ యూనియన్ దేశాల వినియోగదారులకు పేస్బుక్, ఇన్స్టాగ్రామ్కు ఏ ఒక్కదానికి చెల్లించినా.. మరొకటి ఉచితంగా ఇవ్వనున్నది. పేయిడ్ సర్వీసెస్ యూజర్లకు ప్రకటనలు కనిపించవు. దీనిపై మెటా కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. పేయిడ్ వెర్షన్లో యూజర్ల నుంచి ఎంత వసూలు చేస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. రెండు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు ఒకేసారి చెల్లించి వాడుకోవడంతో పాటు.. లేదంటే వేర్వేరుగా ప్లాన్ సైతం ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా.. మెటా 2019 నుంచి యూరోపియన్ యూనియన్ విచారణను ఎదుర్కొంటున్నది. వినియోగదారుల అనుమతి లేకుండా డేటాను సేకరిస్తున్నట్లు కంపెనీపై ఆరోపణలున్నాయి.
0 Comments