అతి తక్కువ బడ్జెట్లో క్లౌడ్ ల్యాప్టాప్ తీసుకువచ్చేందుకు రిలయన్స్ జియో సన్నాహాలు చేస్తోంది. దీని ద్వారా ఒకే ల్యాప్టాప్ను ఎక్కువ మంది యూజర్లు వాడుకోవడానికి వీలవుతుంది. అయితే ఇందుకోసం యూజర్లు ప్రత్యేకంగా సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. రిలయన్స్ జియో ఇటీవలే జియోబుక్ పేరుతో ఒక లో-కాస్ట్ ల్యాప్టాప్ను అందుబాటులోకి తెచ్చింది. దీని ధర రూ.14,499. వాస్తవానికి ఇది కేవలం బేసిక్ కంప్యూటింగ్కు మాత్రమే ఉపయోగపడుతుంది. ప్రొఫెషనల్ వర్క్కు ఇది ఏ మాత్రం ఉపయోగపడదు. అందుకే రిలయన్స్ జియో దీనికి 'క్లౌడ్' సపోర్ట్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. జియో తీసుకురానున్న ఈ క్లౌడ్ ల్యాప్టాప్ అనేది ఒక డంబ్ టెర్నినల్ మాత్రమే అని గుర్తించుకోవాలి. అయితే దీని ప్రాసెసింగ్, స్టోరేజ్ అంతా జియో క్లౌడ్లోనే జరుగుతుంది. అందువల్ల కంప్యూటర్లో చాలా ఖరీదైన సూపర్ ప్రాసెసర్, స్టోరేజ్ డివైజ్లు ఉండాల్సిన అవసరం ఉండదు. కనుక ల్యాప్టాప్ ధర చాలా వరకు తగ్గుతుంది. ప్రస్తుతం జియో కంపెనీ హెచ్పీ క్రోమ్బుక్లో క్లౌడ్ కంప్యూటింగ్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. రిలయన్స్ జియో అతి తక్కువ ధరకే ల్యాప్టాప్ అందించాలనే లక్ష్యంతో ఈ క్లౌడ్ ల్యాప్టాప్ కాన్సెప్ట్ను తీసుకువస్తోంది. అయితే ఈ సర్వీస్ వాడుకోవాలంటే.. యూజర్లు కచ్చితంగా జియో క్లౌడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ జియో క్లౌడ్ ల్యాప్టాప్ వల్ల విద్యాసంస్థలకు ఆర్థికంగా బాగా కలిసిరానుంది. ఎలా అంటే.. విద్యా సంస్థలు తమ విద్యార్థుల కోసం భారీ స్థాయిలో హార్డ్వేర్స్ను కొనుగోలు చేస్తూ ఉంటాయి. దీని వల్ల వాటిపై చాలా ఆర్థిక భారం పడుతుంది. ఒకసారి జియో క్లౌడ్ ల్యాప్టాప్ అందుబాటులోకి వస్తే.. ఈ ఖర్చులు భారీగా తగ్గే అవకాశం ఏర్పడుతుంది. అలాగే ఎంటర్ప్రైజెస్కు కూడా జియో క్లౌడ్ ల్యాప్టాప్స్ బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. జియో కంపెనీ ఈ క్లౌడ్ ల్యాప్టాప్ను ఎప్పుడు మార్కెట్లోకి తెస్తుందో ఇంకా వెల్లడించలేదు.
'క్లౌడ్'తో రిలయన్స్ జియో మేజిక్ !
0
November 20, 2023
Tags