Ad Code

అంగారకుడి మధ్య భాగం కింద వాటర్ ఐస్ !


సౌర కుటుంబంలో భూమి తర్వాత జీవులు ఉండేందుకు అనువైన ప్రదేశంగా అంగారక గ్రహంగా చెప్పబడుతుంది. ఒకప్పుడు నదులు, సముద్రాలతో విలసిల్లిన గ్రహం ప్రస్తుతం బంజరు భూమిగా మారింది. కొన్ని కోట్ల ఏళ్ల క్రితం నుంచి ఆ గ్రహం నిస్సారంగా మారిపోయింది. అయితే ఇప్పటికే అక్కడ జీవులకు సంబంధించిన వివరాలను, గతంలో ఎలా ఉండేదో అనే ఉత్సుకత ఇప్పటికీ పరిశోధకుల్లో ఉంది. అందుకే మార్స్ గ్రహానికి అనేక రోవర్లు, ల్యాండర్లను వివిధ దేశాల అంతరిక్ష సంస్థలు పంపాయి. ఇన్నాళ్లు అంగారకుడి ధృవాల వద్ద మంచు రూపంలో నీరు ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాజాగా అంగారకుడి మధ్యభాగం కింద వాటర్ ఐస్ ఉన్నట్లు గుర్తించారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మార్క్ ఎక్స్‌ప్రెస్ మిషన్ మంచు రూపంలో ఉన్న నీటిని కనుగొంది. గత 20 ఏళ్లుగా అంగారకుడిపై మార్స్ ఎక్స్‌ప్రెస్ అంతరిక్ష నౌక పరిశోధనలు చేస్తోంది. ఇలా మధ్య రేఖ వద్ద నీటి మంచును కనుగొనడం ఇదే తొలిసారి. రాడార్ సిగ్నల్స్ ఆధారంగా ఇది వెలుగులోకి వచ్చింది. ఈ వాటర్ ఐస్ నిక్షేపాలు మందంగా ఉన్నాయని.. 3.7కిమీ (2.3 మైళ్లు) అంగారకుడి గర్భంలో విస్తరించి ఉన్నాయని, అయితే ఈ మంచు స్వచ్ఛంగా లేదని, దమ్ముతో కలుషితమై ఉందని తేలింది. గతంలో నీటితో భూమి లాంటి వాతావరణాన్ని కలిగి ఉన్న అంగారకుడు, తన తక్కువ గురుత్వాకర్షణ, బలమైన మాగ్నెటిక్ ఫీల్డ్ లేకపోవడం వల్ల వాతావరణాన్ని, నీటిని క్రమక్రమంగా కోల్పోయినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సూర్యుడు, ఇతర అంతరిక్ష వస్తువుల నుంచి వచ్చే అవేశిత కణాల కారణంగా గ్రహ వాతావరణం దెబ్బతిని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu