Ad Code

పేటీఎంపై ఈపీఎఫ్‌వో కీలక ఆదేశాలు జారీ


పేటీఎం, దాని అనుబంధ సంస్థలతో ముడిపడిన క్లెయిమ్‌లను పరిష్కరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సంబంధిత అధికారులకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌, దాని అనుబంధ విభాగాలతో అనుసంధానించిన ఖాతాలకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిష్కరించవద్దని ఫీల్డ్ ఆఫీసర్లకు సూచించింది. ఇందుకు సంబంధించిన క్లెయిమ్‌లను ఫిబ్రవరి 23 నుంచి నిలిపివేయాలని స్పష్టం చేసింది. దీనిపై అవగాహన పెంచేందుకు వీడియోను రూపొందించి ప్రచారం చేయాలని సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై జనవరి 31న ఆర్బీఐ కఠిన ఆంక్షలు  విధించిన విషయం తెలిసిందే. కొత్తగా డిపాజిట్లు చేయడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది.ఎన్నిసార్లు హెచ్చరించినా రెగ్యులేటరీ మార్గదర్శకాలను పేటీఎం అనుసరించలేదని, దాని నిర్లక్ష్యం వల్లే కఠిన చర్యలకు దిగాల్సి వచ్చిందని ఆర్బీఐ స్పష్టం చేసింది. అంతేగానీ వ్యవస్థీకృత ఆందోళనలేమీ లేవని ఆర్బీఐ గవర్నర్‌ దాస్‌ వెల్లడించారు. ఈ నెల 29 తర్వాత పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌లోని ఖాతాలు, ప్రీ-పెయిడ్‌ సాధనాలు, ఈ-వ్యాలెట్లలో కస్టమర్లు డిపాజిట్లను చేయరాదని, బ్యాంక్‌ కూడా వాటిని అంగీకరించరాదని జనవరి 31న ఆర్బీఐ ఆంక్షలు పెట్టింది. ఇప్పటికే కొత్త కస్టమర్లను చేర్చుకోవడంపైనా బ్యాంక్‌పై ఆంక్షలుండగా, తాజా పరిమితులతో దాదాపుగా సంస్థ సేవలు నిలిచిపోయినట్టే అవుతున్నది. అయితే ఈ గడువును పొడిగించాలని ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి పేటీఎం సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మ విజ్ఞప్తి చేయగా, ఈ విషయం ఆర్బీఐతోనే తేల్చుకోవాలని మంత్రి సూచించినట్టు సమాచారం.

Post a Comment

0 Comments

Close Menu