Ad Code

సుసర్ల దక్షిణా మూర్తి



సుసర్ల దక్షిణా మూర్తి గారు జన్మించింది. నవంబర్ 11, 1921. సుసర్ల దక్షిణామూర్తి గారి పూర్తి పేరు "సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి". వీరి జననీ జనకులు అన్నపూర్ణ, కృష్ణబ్రహ్మ శాస్త్రి లు. వీరు కృష్ణజిల్లా దివిసీమలో దక్షిణకాశీగా ప్రసిద్ధికెక్కిన పెదకళ్ళేపల్లి గ్రామంలో జన్మించారు. వీరి తాతగారి పేరే ఈయనకూ పెట్టారు. దక్షిణామూర్తి తాత స్వయాన త్యాగయ్య శిష్యుడైన మానాంబుచావడి (ఆకుమళ్ళ) వెంకటసుబ్బయ్యకు శిష్యుడు. ఈయన తండ్రిగారి దగ్గరే సంగీతం నేర్చుకున్నారు. గాత్రం, వయోలిన్ నేర్చుకున్నారు. అయితే, పాఠశాల విద్యాబ్యాసం ఆరోతరగతితోనో, ఏడో తరగతి తోనో ముగిసింది. పదమూడు సంవత్సరాల ప్రాయంలోనే గాత్రంతో, వయోలిన్ తో అనేక రాజాస్థానాలోల కచేరీలు ఇచ్చేరట!. పదహారో ఏట గజారోహణ జరిగిందిట. విజయవాడలో తిరుపతి వేంకట కవులు సుసర్ల వారి గాత్రకచేరి విని ఎంతో మెచ్చుకొని వారిపై పద్యం ఆశువుగా చెప్పేరట. వారు వయొలినే కాకుండా హార్మోనియం, అరుదుగా వేణువు కూడా వాయించేవారు. దక్షిణామూర్తి గారు తల్లిదండ్రులు తెనాలిలో ఉండగా కాంచనమాల ద్వారా దక్షిణా మూర్తి గారి ప్రతిభ విన్న భీమవరపు నరసింహారావు గారు తెనాలి వచ్చి వారి గానం విని మదరాసుకు ఆహ్వనించారు. సినీ సంగీత దర్శకులు భీమవరపు నరసింహారావు వద్ద చేరి, 1937 నుంచి సహాయకునిగా పనిచేసారు. 1938లో 'హిజ్‌ మాస్టర్స్‌ వాయిస్‌' (హెచ్‌.ఎం.వి) సంస్థలో హార్మోనిస్టుగా చేరారు. సంగీత దర్శకుల జంట ఎం.ఎస్‌. విశ్వనాథన్‌ - రామ్మూర్తిలో ఒకరైన రామ్మూర్తి వారికి సహోద్యోగి.1939 ప్రాంతంలో 'ఆకాశవాణి' (ఏ.ఐ.ఆర్‌) - ఢిల్లీలో ప్రవేశించారు. ఆకాశవాణిలో వారు 'ఏ' గ్రేడ్‌ ఆర్టిస్టు. మద్రాసు, కలకత్తా, బెల్గామ్‌, పూనా, బొంబాయి, కటక్‌ లాంటి ఎన్నో చోట్ల ఆకాశవాణిలో పనిచేశారు. మద్రాసులో దాదాపు ఓ ఏడాది పాటు పనిచేశారు. వారి పనితీరుకు మెచ్చి, ఢిల్లీకి వెళ్ళమని మద్రాసు ఆకాశవాణి కేంద్రం డైరెక్టరే వారని ఢిల్లీకి పంపించారట. దక్షిణ భారత భాషల సంగీత నిర్దేశకుడిగా సుసర్ల ఎన్నో మధుర స్వరాలను ఆకాశవాణి శ్రోతలకు అందించారు. జాతీయ వార్త సంస్థ 'సెంట్రల్‌ న్యూస్‌ ఆర్గనైజేషన్‌'లో సంగీత నిర్దేశకుడిగా సేవలందించారు సంగీత సహాయకునిగా వయొలినిస్టుగా అనేక చిత్రాల్లో పనిచేస్తూ వచ్చారు. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు సి.ఆర్‌. సుబ్బురామన్‌ దగ్గర సహాయకుడిగా పలు చిత్రాలకు పనిచేశారు. చెంచులక్ష్మి' (1943), 'రత్నమాల' (1948), 'స్వప్నసుందరి' (1950),  'దేవదాసు' (1953) తదితర చిత్రాలకు కూడా ఆయన పనిచేశారు. నిండైన గాత్రం ఉన్న దక్షిణామూర్తి తొలి రోజుల్లో సినీ నేపథ్య గాయకుడిగా పలు పాటలు పాడారు. 'పరమానందయ్య శిష్యులు' (1950), 'శ్రీ లక్ష్మమ్మ కథ' (1950), 'స్త్రీ సాహసం' (1951) మొదలైన చిత్రాలలో హీరో అక్కినేని నాగేశ్వరరావుకు ప్లే-బ్యాక్‌ పాడారు. 'సర్వాధికారి' (1951) చిత్రంలో తమిళ హీరో ఎం.జి.ఆర్‌.కు గొంతు అరువిచ్చారు. పర్లాకిమిడి రాజా గజపతిదేవ్‌ తీసిన 'నారద నారది' (1946) చిత్రంతో సుసర్ల దక్షిణామూర్తి తొలిసారిగా సంగీత దర్శకత్వం చేపట్టారు. ఆ తరువాత కొల్హాపూర్‌లో నిర్మించిన 'సేతు బంధన్‌' (1946) చిత్రానికీ, పూనాలో నిర్మించిన 'భట్టి విక్రమార్క' చిత్రానికీ సంగీత దర్శకత్వం వహించారు. 'సంసారం' (1950) చిత్రంతో సంగీత దర్శకుడిగా సుసర్ల దక్షిణామూర్తి బాగా ప్రాచుర్యం పొందారు. ఆ రోజుల్లోనే నటి - నిర్మాత లక్ష్మీరాజ్యం నిర్మించిన రెండు, మూడు సినిమాలకు కలకత్తాలో పనిచేశారు. ఆకాశవాణిలో పనిచేయడం కూడా సంగీత దర్శకుడయ్యాక సుసర్లకు బాగా ఉపయోగపడింది. గాయని లతా మంగేష్కర్‌ అప్పట్లో ఢిల్లీ రేడియో స్టేషన్‌లో పాటలు పాడుతుండేది. ఆమె గాత్రంతో, ఆమెతో పరిచయం ఉండడంతో, వారు ఆమెతో తొలిసారిగా తెలుగు సినిమాలో 'నిదురపోరా తమ్ముడా...' అనే పాటను ఆమెతో పాడించారు. అన్ని భాషల్లోనూ కలిపి 135 దాకా చిత్రాలకు సుసర్ల దక్షిణామూర్తి పనిచేశారు. 'సంసారం' (1950) 'ఆలీబాబా - నలభై దొంగలు', 'సర్వాధికారి' (1951), 'ఆడజన్మ' (1951), 'దాసి' (1952), 'సంతానం' (1955), 'ఇలవేలుపు' (1956), 'హరిశ్చంద్ర' (1956), 'భలే బావ' (1957), 'శ్రీకృష్ణలీలలు' (1959), 'అన్నపూర్ణ' (1960), 'నర్తనశాల' (1963), 'శ్రీమద్విరాటపర్వం' (1979), 'శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర' (1984) ఆయన సంగీతం అందించిన సినిమాలలో కొన్ని. సంగీత దర్శకులు ఎస్‌.పి. కోదండపాణి, ఏ.ఏ. రాజ్‌, శ్యామ్‌ మొదలైనవారు ఈయన వద్ద పనిచేసినవాళ్ళే! అలాగే, సంగీత దర్శకుడు ఎం.ఎస్‌. విశ్వనాథన్‌ సైతం సుసర్ల వద్ద హార్మోనిస్టుగా పనిచేశారు. సంగీత దర్శకుడిగా సుసర్ల ప్రధానంగా హార్మోనియమ్‌ మీదే బాణీలు కట్టేవారు. జమునా రాణి, పి. లీల, బెంగుళూరు లత మొదలైన గాయనీమణులకు తొలి అవకాశం ఇచ్చి, పరిచయం చేసింది - సుసర్లే! 'సంతానం' (1955)తో లతా మంగేష్కర్‌నూ, 'ఇలవేలుపు' (1956)తో రఘునాథ్‌ పాణిగ్రాహినీ, 'వచ్చిన కోడలు నచ్చింది' (1959)తో ఎం.ఎల్‌. వసంత కుమారినీ, 'నర్తనశాల' (1963)తో మంగళంపల్లి బాలమురళీకృష్ణనూ సుసర్ల దక్షిణామూర్తి తెలుగు చిత్ర రంగానికి పరిచయం చేశారు. సుసర్ల స్వరపరచగా, రావు బాలసరస్వతి గానం చేసిన 'నీలవణ్ణ కణ్ణా వాడా నీ వరు ముత్తం తాడా...' (శివాజీ గణేశన్‌, పద్మిని నటించిన ఓ తమిళ చిత్రంలోని పాట) లాంటి తమిళ చిత్ర గీతాలు సైతం ఇవాళ్టికీ అక్కడ పాపులరే! సంగీత దర్శకుడిగా అవకాశాలు తగ్గాక, కుటుంబ పోషణ కోసం అప్పటి సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర పాటల రికార్డింగుల్లో వయొలిన్‌ వాద్య కళాకారుడిగా కూడా పనిచేశారు. 1982 నుంచి 1987 వరకు ఆయన చక్రవర్తి సంగీత బృందంలో వయొలిన్‌ వాయించారు. 'నారద నారది'లో చిన్నవేషం, రాజ్యం పిక్చర్స్‌ 'హరిశ్చంద్ర' చిత్రంలో కాశీ రాజు వేషం వేశారు. సుసర్ల దక్షిణామూర్తి అనురాధా మూవీస్‌' అనే సంస్థను నెలకొల్పి, మోహినీ రుక్మాంగద', 'రమా సుందరి' చిత్రాలను నిర్మించారు. సన్మానాలు, సత్కారాలు  ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా ప్రార్థనా గీతం పాడి జవహర్‌లాల్‌ నెహ్రూ చేతులమీదగా సన్మానం అందుకున్నారు. వివిధ ప్రైవేటు సాంస్కృతిక, కళా సంస్థలు ఎన్నో ఎన్నో సన్మానాలు, సత్కారాలు చేశాయి. బిరుదులు ప్రదానం చేశాయి. 'స్వరశిల్పి', 'సంగీత కళాప్రపూర్ణ', 'సుస్వరాల సుసర్ల', 'స్వరబ్రహ్మ', 'సంగీత కళానిధి', 'సంగీత సమ్రాట్‌', ఎన్టీఆర్‌ పేర్కొన్న 'స్వర సుధానిధి' లాంటి బిరుదులు సుసర్లకు దక్కాయి. విదేశాలలో కూడా కచ్చేరీలు చేసి, తమ సంగీత వైభవాన్ని సుసర్ల చాటుకున్నారు. మధుమేహం వ్యాధి వలన కంటి చూపు దెబ్బతింది. దాదాపుగా అంధత్వం ఆవరించింది. అయినా, ఆయన  మనోనేత్రంతో సంగీత లోకాలను దర్శించడం మానలేదు. వయస్సు 90 ఏళ్ళు నిండుతున్నా,  కాస్తంత హుషారుగా అనిపిస్తే, ప్రతిభావంతురాలైన భరతనాట్య కళాకారిణి అయిన మనుమరాలు శుభాంజలీ సద్గురుదాస్‌ లాంటి వారు చేతికి వయొలిన్‌ అందించగానే అలవోకగా పాట పాడుతూ, తీగలపై సుస్వర విన్యాసం సాగిస్తారు. తొంభై ఏళ్ళ వయసులో, కంటి చూపు లేక పూర్తిగా ఇంటికే పరిమితమైనా, చివరివరకు సుసర్ల దక్షిణామూర్తికి సంగీతమే మానసికంగా ఆసరా. చివరి వయస్సులో కూడా ఆయన ఒంటరిగా కూర్చొని, తనలో తానే ఏవో పాటలు, కీర్తనలు పాడుకుంటూ ఉండేవారు. వీరు 2012 ఫిబ్రవరి 09 న అనారోగ్యంతో చెన్నైలో పరమపదించారు. 

Post a Comment

0 Comments

Close Menu