Ad Code

348 యాప్స్‌ నిషేధం !


చైనా సహా ఇతర దేశాలకు చెందిన 348 యాప్స్‌ని నిషేధించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ వివరాలను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్‌సభకు వివరించారు.  పౌరుల ప్రొఫైలింగ్ కోసం వినియోగదారు సమాచారాన్ని సేకరించడం, ఆ వివరాలను అనధికారిక పద్ధతిలో విదేశాలకు తరలించడం లాంటి కారణాలతో ఈ యాప్స్‌ని నిషేధించినట్టు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. లోక్‌సభలో బీజేపీ ఎంపీ రాద్మోల్ నగర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాజీవ్ చంద్రశేఖర్ ఈ వివరాలు వెల్లడించారు. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ అభ్యర్థన మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మొత్తం 348 మొబైల్ యాప్స్‌ని నిషేధించిందని, యూజర్ల డేటాను ట్రాన్స్‌ఫర్ చేయడం భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భారతదేశ రక్షణ, భద్రతకు భంగం కలిగిస్తాయి కాబట్టి బ్యాన్ చేశామని మంత్రి తెలిపారు. నిషేధించిన 348 యాప్స్‌లో చైనాకు చెందిన యాప్స్ కూడా ఉన్నాయి. సౌత్ కొరియా గేమింగ్ దిగ్గజం అయిన క్రాఫ్టన్ రూపొందించిన బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) యాప్‍ను గత వారం ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశం వచ్చిందని, అందుకే యాప్ యాక్సెస్‌ను బ్లాక్ చేసినట్లు గూగుల్ తెలిపింది. 2020 సెప్టెంబర్‌లో క్రాఫ్టన్‌కు చెందిన పబ్‌జీ సహా చైనాతో సంబంధం ఉన్న 117 యాప్స్‌ని నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ యాప్స్ నిషేధించినప్పుడు కూడా డేటా సెక్యూరిటీ ఆందోళనల్ని వ్యక్తం చేసింది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో బ్యాటిల్ రాయల్ గేమ్ ఫ్రీ ఫైర్ సహా చైనాతో సంబంధం ఉన్న 53 యాప్స్‌ని ప్రభుత్వం నిషేధించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని సెక్షన్ 69ఏ ప్రకారం ఈ యాప్స్‌ని ప్రభుత్వం నిషేధించింది. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, భద్రతకు ముప్పు తీసుకొచ్చే యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వం నిఘా నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. అలాంటి యాప్స్ కనిపిస్తే వాటిపై నిషేధం తప్పదు. భారతదేశం బ్యాన్ చేసిన చైనా యాప్స్‌లో టిక్‌టాక్, హెలో, అలీ ఎక్స్‌ప్రెస్, పబ్‌జీ మొబైల్, షేర్ ఇట్, యూసీ బ్రౌజర్, క్యామ్ స్కానర్ లాంటి పాపులర్ యాప్స్ ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu