Ad Code

భారత్‌లో సామ్‌సంగ్ భారీ పెట్టుబడి ?


ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ సామ్‌సంగ్ త్వరలో భారత్‌లో భారీ పెట్టుబడి పెడుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొరియన్ ఎలక్ట్రానిక్స్ సంస్థ అయిన సామ్‌సంగ్ నోయిడాలోని అతిపెద్ద మొబైల్ ఫోన్ ప్లాంట్‌లో ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించింది. దీన్ని మరింత పోటీగా మార్చడానికి స్మార్ట్ తయారీ సామర్థ్యాలను ఏర్పాటు చేయడానికి పెట్టుబడి పెట్టనుందని కంపెనీ మొబైల్ బిజినెస్ గ్లోబల్ హెడ్ ఇటీవల విలేకరులకు తెలిపారు. సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రెసిడెంట్, మొబైల్ ఎక్స్‌పీరియన్స్ బిజినెస్ హెడ్ టీఎం రోహ్ మాట్లాడుతూ సామ్‌సంగ్ కంపెనీ దేశంలో పరిశోధన, అభివృద్ధి సౌకర్యాల్లో పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తుందని చెప్పారు. నోయిడా సౌకర్యాలను మెరుగుపర్చడమే కాకుండా స్మార్ట్ ఫ్యాక్టరీని తీసుకురావడానికి పెట్టుబడిని కొనసాగిస్తామని పేర్కొన్నారు. స్మార్ట్ ఫ్యాక్టరీ కోసం మా పెట్టుబడి ఉత్పత్తిలో పోటీతత్వాన్ని తెస్తుందని నమ్ముతున్నట్లు వివరించారు. సామ్‌సంగ్ నోయిడాలో ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద తయారీ కేంద్రాన్ని కలిగి ఉంది. ఈ సంవత్సరం కంపెనీ తన ప్రీమియం గెలాక్సీ ఎస్ 23 సిరీస్‌ను ఇక్కడే తయారు చేయడం ప్రారంభించింది. ఇక్కడ సామ్‌సంగ్ అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఉంది. కొత్త ఆవిష్కరణల కోసం ఇక్కడ పెట్టుబడి పెడుతున్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. సామ్‌సంగ్ భారతదేశం అంతటా ఆర్ అండ్ డీ కేంద్రాల్లో దాదాపు 10,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో దాదాపు 3,500 మంది వ్యక్తులతో అతిపెద్ద బేస్‌గా బెంగళూరు కేంద్రం ఉంది.

Post a Comment

0 Comments

Close Menu