Ad Code

స్మార్ట్ ఫోన్ వాడకంతో వచ్చే ముప్పు !


స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రజాధరణ పొందాయి. టెలివిజన్, కంప్యూటర్ గేమ్‌లపై మక్కువ బాగా తగ్గింది. కరోనా మహమ్మారి తర్వాత ఆన్‌లైన్ క్లాసుల జోరు పెరిగింది. దీంతో యువత స్మార్ట్ ఫోన్ వాడే సమయం కూడా విపరీతంగా పెరిగింది. అలాగే స్మార్ట్ ఫోన్ స్క్రీన్‌ చూస్తూ ఎక్కువ సమయం గడుపుతున్నారు. కొన్నిసార్లు పేలవమైన భంగిమతో వెన్నునొప్పితో బాధపడుతున్నారు. అంతేకాకుండా ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా స్మార్ట్ ఫోన్ వాడకం కారణమవుతుంది. అయితే స్క్రీన్ సమయం ఎక్కువగా గడపడం వల్ల వచ్చే అనారోగ్యాల గురించి కొంతమంది పరిశోధకులు పరిశోధనలు చేస్తున్నారు. బ్రెజిలియన్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో స్మార్ట్ ఫోన్ వాడకం వల్ల వెన్నెముక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడైంది. ముఖ్యంగా రోజుకు మూడు గంటల కంటే ఎక్కువసేపు స్క్రీన్‌లను చూడటం లేదా స్క్రీన్‌కు దగ్గరగా ఉండటం లేదా మంచి భంగిమ కూర్చోకపోవడం వల్ల వెన్నెముక సమస్యలు వస్తాయని తేలింది.  బ్రెజిల్‌లో చేసిన అధ్యయనంలో ముఖ్యంగా థొరాసిక్ వెన్నెముక నొప్పి (టీఎస్పీ) పై దృష్టి పెట్టారు. థొరాసిక్ వెన్నెముక ఛాతీ వెనుక భాగంలో (థొరాక్స్), ఎక్కువగా భుజం బ్లేడ్‌ల మధ్య ఉంటుంది, మెడ దిగువ నుంచి నడుము వెన్నెముక ప్రారంభం వరకు విస్తరించి ఉంటుంది. దాదాపు 14 నుంచి 18 సంవత్సరాల వయస్సు ఉన్న మగ, ఆడ విద్యార్థుల సర్వేల నుంచి ఈ విషయం కనుగొన్నారు. ముఖ్యంగా ఈ సర్వేలో 1,628 మంది పాల్గొన్నారు. అధికంగా ఫోన్ వినియోగం వల్ల ఎక్కువ మంది టీెఎస్పీతో బాధపడుతున్నారని తేలింది. మగవారితో పోలిస్తే ఆడవాళ్లు ఎక్కువగా టీఎస్పీతో బాధపడుతున్నారు. దాదాపు ఈ సర్వే 10 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని తేలింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది టీఎస్పీతో బాధపడుతున్నారు. ముఖ్యంగా 15 నుంచి 35 శాతం మంది పెద్దవారిలో ఈ సమస్య ఉంటుంది. అలాగే కౌమారదశలో ఉన్నవారిలో 13 శాతం-35 శాతం వరకు ఉంటుంది. ముఖ్యంగా కరోనా తర్వాత ఈ సమస్యతో బాధపడేవారు అధికమయ్యారు. అయితే హైస్కూల్ విద్యార్థుల్లో టీెఎస్పీ గుర్తింపు చాలా ముఖ్యం. ఎందుకంటే కౌమార దశ నుంచి మంచి ఆరోగ్యం కోసం ఈ సమాచారం ఉపయోగపడుతుంది. కాబట్టి పిల్లలు ఎక్కువసేపు స్మార్ట్ ఫోన్ వినియోగించకుండా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu