Ad Code

షావోమీ విద్యుత్‌ కారును ఆవిష్కరణ !


షావోమీ విద్యుత్‌ కారును ఆవిష్కరించింది. బీజింగ్‌లో జరిగిన కార్యక్రమంలో కంపెనీ సీఈఓ 'లీ జున్‌' దీన్ని పరిచయం చేశారు. ఎస్‌యూ7గా వ్యవహరించే ఈ కారును మార్చి 28న చైనాలో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఈ సెడాన్‌లో ఉన్న ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కంపెనీ ప్రముఖ ఫోన్లతో అనుసంధానమయ్యేలా రూపొందించారు. చైనాలో దిగ్గజ కంపెనీలుగా పేరొందిన 'కాన్‌టెంపరరీ యాంపరెక్స్‌ టెక్నాలజీ', బీవైడీ నుంచి తీసుకున్న బ్యాటరీలను ఈ కార్లలో వాడుతున్నారు. భవిష్యత్తులో ప్రపంచంలో తొలి ఐదు దిగ్గజ వాహన తయారీ సంస్థల్లో ఒకటిగా నిలుస్తామని లీ జున్‌ ధీమా వ్యక్తం చేశారు. ఈ కారుని 'సెల్‌-టు-బాడీ' టెక్నాలజీతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. దీంతో బ్యాటరీని నేరుగా వాహన నిర్మాణానికే అనుసంధానం చేసినట్లు వివరించారు. ఫలితంగా కారు దృఢత్వం పెరిగిందని పేర్కొన్నారు. ఇప్పటికే కంపెనీ రూపొందించిన అనేక యాప్‌లకు ఈ కారులో యాక్సెస్‌ ఉంటుందన్నారు. ఈ కారు ఎస్‌యూ7, ఎస్‌యూ7 మ్యాక్స్‌ పేరిట రెండు వేరియంట్లలో లభించనుంది. ఎస్‌యూ 7 విషయానికి వస్తే.. 0-100 kmph వేగాన్ని 5.28 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ తెలిపింది. అలాగే ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 668 కిలోమీటర్లు వెళ్తుంది. గరిష్ఠ వేగం గంటకు 210 కి.మీ. అత్యధికంగా 400 ఎన్‌ఎం టార్క్‌ వద్ద 299 పీఎస్‌ శక్తిని విడుదల చేస్తుంది. ఈ కార్ల ధరలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

Post a Comment

0 Comments

Close Menu