Ad Code

ఐటీ రూల్స్ పై వాట్సాప్ తీవ్ర అసహనం !


వాట్సాప్ సందేశాల ఎన్‌క్రిప్షన్‌ను ప్రభుత్వం కోరినప్పుడు తొలగించాలంటూ బలవంతం చేస్తే, సోషల్ మెసేజ్ ప్లాట్‌ఫాం దేశం నుండి నిష్క్రమిస్తుందని  ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఎన్‌క్రిప్షన్‌ను విచ్ఛిన్నం చేయమని మాకు చెబితే, వాట్సాప్ దేశం నుంచి వెళ్తుంది" అని వాట్సాప్ తరఫు న్యాయవాది తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరాలతో కూడిన ధర్మాసనానికి చెప్పారు. 2021 నాటి ఐటీ నిబంధనలను సవాలు చేస్తూ వాట్సాప్, మెటా సంస్థలు గతంలో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ క్రమంలో గురువారం వాట్సాప్, మెటా సంస్థలు కోర్టు ముందు తమ వాదనలు వినిపించాయి. 2021 ఐటీ మార్గదర్శకాల ప్రకారం, సోషల్ మీడియా సంస్థలు ప్రభుత్వం కోరినప్పుడు మెసేజీల ఎన్‌క్రిప్షన్ తొలగించి సమాచార మూలాలు బహిర్గతం చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్రం అప్పట్లో ఐటీ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) పేరిట మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిబంధన పాటించడం కుదరదని వాట్సాప్, మెటా తరపు న్యాయవాదులు న్యాయస్థానానికి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏ సమాచారం కోరుతోందో ముందుగా తెలీదు కాబట్టి తాము ప్రభుత్వం కోరినప్పుడు మెసేజీ మూలాలు కనిపెట్టేందుకు వీలుగా కోట్లల్లో మెసేజీలను ఏళ్ల తరబడి సోర్ట్ చేయాల్సి ఉంటుందని అన్నారు. అయితే, ఈ విషయమై వాదులు, ప్రతివాదుల మధ్య మరింత చర్చ జరగాలని కోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి చట్టం మరే దేశంలోనైనా ఉందా అన్న కోర్టు ప్రశ్నకు బ్రెజిల్ లాంటి దేశాల్లో కూడా ఈ రూల్స్ లేవని మెటా తరపు లాయర్లు పేర్కొన్నారు. అయితే, ప్రైవసీ అనేది అనుల్లంఘనీయం కాదన్న కోర్టు.. అవసరాలకు హక్కులకు మధ్య సమతౌల్యం ఉండాలని పేర్కొంది. కేంద్రం తరపు న్యాయవాదులు ఈ మార్గదర్శకాలు అవసరమని పేర్కొన్నారు. అభ్యంతర కంటెంట్, ఉగ్రవాదం, సమాజంలో హింసకు కారణమయ్యే కంటెంట్ మూలాలు తెలియాల్సిందేనని స్పష్టం చేశారు. 2021 ఐటీ మార్గదర్శకాలకు సవాలు చేస్తూ వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో ఉన్న పిటిషన్లు తొలుత సుప్రీం కోర్టుకు చేరాయి. అయితే, సర్వోన్నత న్యాయస్థానం వీటిని ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ మార్చి 22న ఆదేశాలు జారీ చేసింది.

Post a Comment

0 Comments

Close Menu