Ad Code

భూమికి దగ్గరగా వెళ్లనున్న 2024 సీజే8 గ్రహశకలం !


నేడు భూమికి దగ్గరగా ఒక ఒక భారీ గ్రహశకలం వెళ్లనుందని నాసా తెలిపింది. కుతుబ్మినార్కు డబుల్ సైజులో ఉన్న ఈ గ్రహశకలం సైజు 61 మీటర్ల నుంచి 140 మీటర్ల మధ్య ఉండవచ్చని అంచనా. దీనికి 2024 సీజే8 అని కూడా పేరు పెట్టారు. నాసా సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ (సీఎన్ఈవోఎస్) డేటా ప్రకారం ఈ గ్రహశకలం భూమికి 66 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి దూసుకువెళ్లనుంది. దీని వేగం ఏకంగా గంటకు 43 వేల కిలోమీటర్లుగా ఉండనుందని నాసా ప్రకటించింది. దీని సైజు 140 మీటర్ల కంటే ఎక్కువగా ఉండి, భూమికి 46 లక్షల కిలోమీటర్ల లోపు దూరం నుంచి వెళ్లే అవకాశం ఉంటే దీన్ని ప్రమాదంగా గుర్తించవచ్చు. ఈ రెండిటికీ ఇది దగ్గరలో ఉంది కాబట్టి ప్రస్తుతానికి దీన్ని చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. భూమికి ప్రమాదకరంగా పరిణమించే గ్రహశకలాలు కొన్ని సార్లు భూమిని ఢీకొట్టే అవకాశం కూడా ఉంటుంది. గ్రహశకలం సైజు, భూమి కక్ష్యకు, వాటికి మధ్య దూరాన్ని బట్టి ఇవి ప్రమాదకరమైనవో కాదో గుర్తిస్తారు. భూమిపై ఉండే టెలిస్కోపులు, అంతరిక్షంలో ఉండే పర్యవేక్షణా కేంద్రాలు, రాడార్ వ్యవస్థల ద్వారా ఈ గ్రహశకలాలను పరిశీలిస్తూ ఉంటారు. 2024 సీజే8 గ్రహశకలంతో పాటు మరో చిన్న స్పేస్ రాక్ కూడా వస్తుంది. దీనికి 2024 ఈకే4 అని పేరు పెట్టారు. దీని సైజు ఏడు నుంచి 14 మీటర్ల మధ్య ఉండవచ్చని నాసా ప్రకటించింది. భూమి 40 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ఇది ప్రయాణించనుంది. భూమికి ప్రమాదంగా మారే ఇటువంటి గ్రహశకలాలను గుర్తించడంలో నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఈ నెల ప్రారంభంలోనే షాకింగ్ డేటాను విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం 140 మీటర్ల కంటే ఎక్కువ సైజులో ఉండి, భూమికి దగ్గరగా ఉన్న 10,700 ఆస్టరాయిడ్లను గుర్తించినట్లు తెలిపింది. ఇటువంటివి మరో 14 వేల వరకు కనుగొనాల్సి ఉన్నాయని అంచనా.

Post a Comment

0 Comments

Close Menu