ముంబైలోని దాదర్కు చెందిన వ్యక్తి 2022 జులై 10న ఫ్లిప్కార్ట్ ద్వారా ఐఫోన్ కొనుగోలు కోసం క్రెడిట్ కార్డు ద్వారా రూ.39,628 చెల్లించాడు. జులై 12న డెలివరీ రావాల్సి ఉంది. అయితే ఆరు రోజుల తర్వాత అతని ఆర్డర్ క్యాన్సిల్ చేసినట్లు ఫ్లిప్కార్ట్ నుంచి మెసేజ్ వచ్చింది. డెలివరీ చేసేందుకు Ekart ద్వారా చాలాసార్లు ప్రయత్నం చేసినా స్పందన లేకపోయిన కారణంగా ఆర్డర్ రద్దుచేసినట్లు సంస్థ పేర్కొంది. దీంతో సదరు వ్యక్తి జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్కు ఫిర్యాదు చేశారు. తాను బుకింగ్ చేసిన ఐఫోన్ ఆర్డర్ కారణంగా ఆర్థిక నష్టం, మానసిక క్షోభకు గురైనట్లు పేర్కొన్నాడు. మరియు ఇది ఆన్లైన్ మోసం కిందకూ వస్తుందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా ఫ్లిప్కార్ట్ ను కమిషన్ వివరణ కోరింది. అయితే తమది కేవలం ఆన్లైన్ పోర్టల్ మాత్రమేనని ఫ్లిప్కార్ట్ తెలిపింది. ఇది కస్టమర్, ఇంటర్నేషనల్ వాల్యూ రిటైల్ ప్రైవేట్ లిమిడెట్ సంస్థ మధ్య వివాదమని పేర్కొంది. కస్టమర్ చెల్లించిన నగదును తిరిగి చెల్లిస్తామని తెలిపింది. దీనిపై విచారణ సందర్భంగా కమిషన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఐఫోన్ ఆర్డర్ చేసిన కస్టమర్ సదరు సంస్థకు అందుబాటులో ఉన్నారని, ఆ సమయంలోనే ఆర్డర్ను రద్దు చేసినట్లు కమిషన్ తెలిపింది. వివాదాన్ని పరిష్కరించేందుకు తాము ప్రయత్నం చేసినట్లు సంస్థ కస్టమర్కు చెప్పినట్లు కమిషన్ తెలిపింది. దీంతో ఈ వివాదంలో ఫ్లిప్కార్ట్కు బాధ్యత ఉందని స్పష్టం చేసింది. అయితే వివాదం అనంతరం కస్టమర్కు నగదు రిఫండ్ చేసి కొత్తగా మరో ఆర్డర్ చేసుకోవాలని సూచించిన, ఆఫర్ ముగిసిన కారణంగా ఐఫోన్ ధర రూ.7000 పెరిగిందని కమిషన్ తెలిపింది. ఈ వ్యవహారం కస్టమర్ను మనోవేదనకు గురిచేయడమేనని కమిషన్ స్పష్టం చేసింది. అదనపు లాభాల కోసమే ఇలా వ్యవహరించాలని భావిస్తున్నట్లు చెప్పిన కమిషన్.రూ.10000 జరిమానా చెల్లించాలని స్పష్టం చేసింది.
0 Comments