ఆండ్రాయిడ్ యూజర్ల కోసం 'ఫైండ్ మై డివైజ్ నెట్వర్క్' అనే ఫీచర్ను ఈరోజు గూగుల్ కంపెనీ లాంఛ్ చేయనుంది. దీనితో మనం పోగొట్టుకున్న ఫోన్ ఎక్కడుందో సులువుగా తెలుసుకోవచ్చు. మన ఫోన్ను దొంగ స్విచ్ఛాఫ్ చేసినా, దాని లొకేషన్ను ట్రాక్ చేయొచ్చు. ఒకవేళ మన డివైజ్లోని మొత్తం ఛార్జింగ్ అయిపోయినా.. దాని చివరి లొకేషన్ను మనకు తెలియజేయడమే ఈ ఫీచర్ ప్రత్యేకత. దీన్ని ఉపయోగించి ఆండ్రాయిడ్ ఫోన్లు, ట్యాబ్లెట్స్తో పాటు దానితో పెయిర్ చేసిన ఇయర్బడ్స్, హెడ్ఫోన్లకు కూడా మనం ట్రాక్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్తో లింక్ చేసి ఉన్న వాలెట్స్, కీస్, బైక్ల జాడను కూడా కనిపెట్టొచ్చు. ఇప్పటికే ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ యూజర్లకు గూగుల్ Find My Device Appను అందుబాటులోకి తెచ్చింది. దీన్ని ఉపయోగించి ఆండ్రాయిడ్ ఫోన్లను ట్రాక్ చేయొచ్చు. కానీ ఎవరైనా ఆ ఫోన్ను స్విచ్ఛాఫ్ చేస్తే.. దాని జాడను గుర్తించడం వీలుకాదు. ఈ లోపాన్ని అధిగమించడానికి 'ఫైండ్ మై డివైజ్ నెట్వర్క్'ను ఇవాళ గూగుల్ లాంఛ్ చేయనుంది. యాపిల్ కంపెనీ 2019లో తొలిసారిగా బ్లూటూత్ బేస్డ్ ట్రాకర్ 'ఎయిర్ట్యాగ్'ను ప్రారంభించింది. అయితే అప్పట్లో ఈ ఫీచర్ కేవలం ఐఫోన్, ఐప్యాడ్లకు మాత్రమే పరిమితమైంది. ఆ తర్వాత బ్లూటూత్ ఆధారిత ట్రాకర్ను గుర్తించి, వాటిని తొలగించడానికి యూనివర్సల మెకానిజంతో ముందుకు రావడానికి యాపిల్ కంపెనీ గూగుల్తో జతకట్టింది. శాంసంగ్, టెలీ, చిపోలో, యూఫీ సెక్యూరిటీ, పెబ్బెల్బీ లాంటి ఇతర బ్రాండ్లు కూడా ఈ డ్రాఫ్ట్ స్పెసిఫికేషన్కు మద్దతునిచ్చాయి. దీంతో ఈ బ్రాండెడ్ డివైజ్లు ఉపయోగించే వినియోగదారులు అందరూ, తమను అనుసరించే ట్రాకర్ల గురించి అలర్ట్లు పొందే వీలు ఏర్పడింది. యాపిల్ కంపెనీ ఈ నెలాఖరులోగా ఐఓఎస్ 17.5 అప్డేట్లో సరికొత్త యాంటీ-స్టాకింగ్ ఫీచర్ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. గూగుల్ కంపెనీ కూడా ఇవాళ అదే సామర్థ్యం కలిగిన సరికొత్త 'ఫైండ్ మై డివైజ్' నెట్వర్క్ యాప్ను తీసుకొస్తోంది.
0 Comments